English | Telugu
అయోధ్యలో ఏప్రిల్ నుంచి రామాలయ నిర్మాణ పనుల ప్రారంభం...
Updated : Feb 7, 2020
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో ఆలయ ట్రస్టు పనులు మొదలుపెట్టబోతోంది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఏప్రిల్ నుంచి పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. విరాళాల సేకరణ, ఆలయ నమూనా, భక్తుల సౌకర్యాల వంటి వాటిపై ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఏప్రిల్ రెండున శ్రీరామనవమి కావడంతో అదే రోజు పనులు ప్రారంభం కావచ్చు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన కసరత్తు వేగవంతం అయ్యింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేయటంతో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. సీనియర్ అడ్వకేట్ పరాశరన్ ఛైర్మన్ గా పదిహేనుమంది సభ్యులతో కేంద్ర హోంశాఖ ట్రస్ట్ ను నోటిఫై చేసింది. ప్రయాగ్ రాజ్ లో ట్రస్టు తొలి సమావేశం జరుగుతుంది. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నది తొలి సమావేశంలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ రెండున శ్రీరామ నవమి, ఏప్రిల్ ఇరవై ఆరున అక్షయ తృతీయ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఆలయ నిర్మాణం కోసం నగదు, ఆస్తుల రూపంలో ఎవరు విరాళాలిచ్చినా షరతుల్లేకుండా స్వీకరిస్తామని ట్రస్టు ప్రకటించింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏదైనా సంస్థ నుంచి రుణాలు తీసుకునే అధికారాన్ని కూడా ట్రస్టుకే కట్టబెట్టింది ప్రభుత్వం. ట్రస్ట్ బాధ్యతలు ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నిబంధనలను రూపొందించింది. ట్రస్ట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు విరాళాల సేకరణ ఆలయ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవటం ఇలాంటి ప్రతి అంశానికీ ట్రస్టుదే బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి రెండేళ్ళల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.