English | Telugu

లింగమనేని కార్యాలయంలో ఐటీ సోదాలు

తెలుగుదేశం పార్టీకి ఆర్ధిక మూల స్థంబాలైన‌ సంస్థ‌ల‌పైనే ఐటి గురి చేసి దాడులు నిర్వ‌హిస్తోంది.

టీడీపీ విజయం కోసం ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారి జాబితా తీసుకొని ఐటి దాడులు కొన‌సాగుతున్నాయి.

మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితులపై మరోసారి ఆదాయ‌పు ప‌న్ను శాఖ దాడులు నిర్వ‌హించింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి యజమాని లింగమనేని రమేష్ తో పాటు రాష్ట్రంలోని నారాయణ, చైతన్య విద్యాసంస్ధల క్యాంపస్ లలోనూ ఐటీ సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రాజధాని భూముల వ్యవహారంలో లింగమనేని వెంచర్స్‌ యజమాని రమేష్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

గతంలో చంద్రబాబు మాజీ కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తో పాటు మరికొందరు టీడీపీ ముఖ్యనేతల కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలకు సంబందించిన ఆధారాలు సంపాదించిన ఐటీ శాఖ ఇప్పుడు మరికొందరి కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఇందులో చంద్రబాబు ఉండవల్లి నివాసం యజమాని లింగమనేని రమేష్ కు చెందిన లింగమనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యాసంస్ధలు కూడా ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్ లోని లింగమనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో చైతన్య, నారాయణ విద్యాసంస్ధలకు చెందిన పలు క్యాంపస్ లలో ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. వీరంతా గతంలో టీడీపీ విజయం కోసం పలు ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారే.

అలాగే గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కు మద్దతుగా వీరు నిధులు సరఫరా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఆదేశాలతో వీరు కాంగ్రెస్ కు నిధులు పంపారా అన్న కోణంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.