English | Telugu

డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణపై దేవినేని ఫైర్.. సీబీఐ విచారణకు డిమాండ్

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... డీజీపీ ఆఫీసులో సాక్షి మీడియా పర్యవేక్షణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, డీజీపీ ఆఫీసులో నిర్ణయాలను సీఎం జగన్ సన్నిహితులు తీసుకుంటున్నారని ఉమ ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు.

పోలీసు శాఖలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, పోలీసుల వ్యవహారశైలిపైనా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. పోలీసుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా మార్పురావడంలేదని ఆయన మండిపడ్డారు. న్యాయవ్యవస్థను ప్రశ్నించే స్థాయికి పోలీసులు వెళ్లారని ఆయన విమర్శించారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పటికీ నీళ్లు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ సర్కారు అని అన్నారు.