English | Telugu

హుండీ సొమ్ముతో ఆలా ఎలా చేస్తారు.. ఏపీ సర్కారును ప్రశ్నించిన బీజేపీ 

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకు పడ్డారు. దేవాదాయశాఖకు చెందిన రూ.25 కోట్ల నిధులను జీవో-18 ద్వారా అమ్మఒడి పథకానికి ఏపీ సర్కారు మళ్లించిందని.. ఆ హక్కు మీకెక్కడిది? అంటూ ఆయన సర్కారును ప్రశ్నించారు. దేవాదాయ శాఖ నిధులను వేరే పథకాలకు మళ్లించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అయన పేర్కొన్నారు. ఈ నిధులు మళ్లించడం అనేది జగన్ ప్రభుత్వానికి ఓ అలవాటుగా మారిందని అయన విమర్శించారు.

భక్తులు ఎంతో భక్తి తో తమ డబ్బును హుండీల్లో వేస్తారని.. దానితో దేవాలయాల అభివృద్ధి, ధర్మపరిరక్షణ కోరుకుంటారని అన్నారు. అటువంటి దేవాదాయ శాఖ నిధులను ఇతర శాఖలకు ఖర్చు చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుండి దేవాదాయశాఖకు ఒక్క పైసా ఇవ్వనప్పుడు, భక్తులు ఇచ్చిన సొమ్ము తీసుకునే హక్కు మీకెక్కడిది అంటూ అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం హిందూ ఆలయాల విషయంలోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని, ఇతర మతాలకు చెందిన విషయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఈ సర్కారుకు ఉందా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.