English | Telugu

చిత్ర నిర్మాణానికి దానయ్య బ్రేక్‌.. ‘ఓజీ’ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా?

పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో డి.వి.వి.దానయ్య నిర్మించిన ‘ఓజి’ చిత్రం మొదటి రోజు 154 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 308 కోట్లు కలెక్ట్‌ చేసి పవన్‌కళ్యాణ్‌ సినిమాల్లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సుజిత్‌ కొట్టిపారేయలేదు. సీక్వెల్‌ కోసం సుజిత్‌ ఒక మంచి పాయింట్‌ చెప్పాడని పవన్‌కళ్యాణ్‌ కూడా అనడంతో ఈ ప్రాజెక్ట్‌ కన్‌ఫర్మ్‌గా ఉంటుందని ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఓజీ సీక్వెల్‌ హక్కులు కూడా నిర్మాత దానయ్యకే చెందుతాయి. కాబట్టి మరొకరు ఈ ప్రాజెక్ట్‌ చేసే అవకాశం లేదు. ఒకవేళ వేరే వాళ్ళు చేసే పక్షంలో దానయ్య నుంచి నో అబ్జెక్షన్‌ లెటర్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఓజీ సీక్వెల్‌ను మరో నిర్మాత చేస్తాడనే చర్చ ఎందుకు జరుగుతోందంటే.. ప్రస్తుతానికి దానయ్య చిత్ర నిర్మాణానికి బ్రేక్‌ ఇవ్వబోతున్నారని, కొంత విరామం తర్వాత మళ్లీ సినిమా నిర్మాణంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క నానితో సుజిత్‌ చేసే సినిమా పూర్తి కావడానికి ఒకటినర్న సంవత్సరం పట్టే అవకాశం ఉంది. మరి దానయ్య మరో సినిమా చెయ్యకుండా బ్రేక్‌ తీసుకోవడానికి నాని, సుజిత్‌ సినిమాయే కారణమా లేక సీక్వెల్‌ కోసమే దానయ్య ఇప్పట్లో సినిమా చెయ్యకూడదనే నిర్ణయం తీసుకున్నారా అనే సందేహం కూడా అందరిలో ఉంది.

ఇదిలా ఉంటే.. ‘ఓజీ’ రిలీజ్‌ అవ్వకముందే నాని, సుజిత్‌ కాంబినేషన్‌లో దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఎనౌన్స్‌మెంట్‌ వచ్చింది. తాజాగా కొత్త సినిమాల నిర్మాణానికి బ్రేక్‌ తీసుకోవాలని దానయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు తప్పుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ‘బ్లడీ రోమియో’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ‘ఓజీ’ భారీ విజయం సాధించినప్పటికీ దానయ్య చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని ఆర్థిక పరమైన కారణాలు వున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఓజీ’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సుజిత్‌ ఇమాజినేషన్‌కి అవసరమైన టెక్నికల్‌ క్వాలిటీని తీసుకొచ్చేందుకు బడ్జెట్‌ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. కలెక్షన్లు బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించలేదనే వాదన కూడా ఉంది. పెట్టిన బడ్జెట్‌కి, కలెక్షన్స్‌కి బ్యాలన్స్‌ కుదరకపోవడం వల్లే దానయ్య సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.