English | Telugu

దేవిశ్రీప్రసాద్‌కి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన దిల్‌రాజు?

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’ అన్నట్టుగా హీరో అవ్వాలన్న దేవిశ్రీప్రసాద్‌ కలను దిల్‌రాజు నిజం చేయబోతున్న విషయం తెలిసింది. ‘బలగం’ వంటి అర్థవంతమైన సినిమాను తెరకెక్కించి టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయిన వేణు ఎల్దండి.. తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌ ‘ఎల్లమ్మ’ అంటూ చాలా రోజుల క్రితమే ఎనౌన్స్‌ చేశాడు. మొదట ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నితిన్‌, శర్వానంద్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌.. చాలా మంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఆ ఛాన్స్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ని వరించింది.

టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్‌.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చాలా సంవత్సరాల క్రితమే వార్తలు వచ్చాయి. అది నిజమేనని దేవి మాటల్లో కూడా తెలిసింది. అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్‌ అవ్వలేదు. ఇప్పటివరకు తన ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌తో ప్రేక్షకుల్ని ఉత్సాహపరిచిన దేవి.. ఇప్పుడు తన పెర్‌ఫార్మెన్స్‌తో వెండితెరపై మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘బలగం’ చిత్రంలో అన్ని ఎమోషన్స్‌తో ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసిన వేణు.. ‘ఎల్లమ్మ’ చిత్రంలోనూ కథ పరంగా, పాత్రల పరంగా మరోసారి ఆడియన్స్‌ని ఎమోషనలైజ్‌ చేసే విధంగా స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ కథకు దేవిశ్రీప్రసాద్‌ వంటి మ్యూజిక్‌ లెజెండ్‌ని ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘ఎల్లమ్మ’ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దేవిశ్రీప్రసాద్‌ సరసన కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా దిల్‌ రాజు ఫిక్స్‌ చేశారనే వార్త వినిపిస్తోంది. ఇటీవలికాలంలో తెలుగు సినిమాలపై పెద్దగా ఫోకస్‌ పెట్టని కీర్తి సురేష్‌ ఒకేసారి రెండు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్‌ అయింది. ఆ రెండు సినిమాలూ దిల్‌రాజు బేనర్‌ నుంచి వస్తుండడం విశేషం. విజయ్‌ దేవరకొండ హీరోగా దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ జనార్థన్‌’ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అగ్రిమెంట్‌ ప్రకారం దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌కి కీర్తి సురేష్‌ రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఒకటి ‘రౌడీ జనార్థన్‌’ కాగా, రెండో సినిమా ‘ఎల్లమ్మ’ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయిపల్లవి, కీర్తి సురేష్‌ పేర్లను పరిశీలించిన దిల్‌రాజు ఫైనల్‌గా కీర్తి సురేష్‌కే ఆ అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.