English | Telugu

"త‌మిళుల్ని ఎందుకు త‌ప్పుగా చూపిస్తాం?".. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' డైరెక్ట‌ర్ రాజ్

త‌మిళుల్ని టెర్రరిస్టులుగా చూపిస్తున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ను ప్ర‌సారం కాకుండా బ్యాన్ చెయ్యాల‌ని త‌మిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న ఎండీఎంకే నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు వైకో సైతం ఈ విష‌య‌మై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా కేంద్ర స‌మాచార‌-ప్ర‌సార శాఖా మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు ఓ లేఖ కూడా రాశారు. అయితే త‌మ వెబ్ సిరీస్‌లో త‌మిళుల్ని త‌ప్పుగా చిత్రించామ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆ సిరీస్ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన రాజ్ నిడిమోరు తిప్పికొట్టారు.

హాఫ్‌-త‌మిళియ‌న్ అయిన రాజ్‌, "ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2లోని యూనిట్ స‌భ్యుల్లో ఎక్కువ‌మంది త‌మిళులే. ఇందులో త‌మిళియ‌న్ క్యారెక్ట‌ర్ పోషించిన స‌మంత అక్కినేని త‌మిళ‌నాడును త‌న ఇల్లుగా ప‌రిగ‌ణిస్తారు. నేను స‌గం త‌మిళుడినే. ఈ షోలోని ఇత‌ర న‌టులు, సాంకేతిక నిపుణులు త‌మిళ‌నాడుకు చెందిన‌వాళ్లే. పైగా, మేమంతా త‌మిళ‌నాడు క‌ల్చ‌ర్‌, రాజ‌కీయాల విష‌యంలో చాలా సున్నితంగా ఉండే బాధ్య‌తాయుత పౌరులం. త‌మిళుల్ని త‌ప్పుగా మేమెందుకు చూపిస్తాం?" అని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించారు. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ద ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2' స్ట్రీమింగ్ కానున్న‌ది.

"స‌మంత చేసిన పాత్ర‌ను సిరీస్ చూశాక జ‌డ్జ్ చేయాలి కానీ, ట్రైల‌ర్ చూసి కాదు." అని కూడా రాజ్ అన్నారు. ఈ షోలో ఓ టెర్ర‌రిస్ట్ గ్రూప్‌కు చెందిన రాజీ అనే పాత్ర‌ను స‌మంత పోషించగా, అండ‌ర్ క‌వ‌ర్ ఏజెంట్ శ్రీ‌కాంత్ తివారీగా మెయిన్ లీడ్‌ను మ‌నోజ్ బాజ్‌పేయి చేశాడు. ఆయ‌న భార్య పాత్ర‌లో ప్రియ‌మ‌ణి క‌నిపించ‌నున్న‌ది.