English | Telugu
యాసిడ్ దాడి తర్వాత కంగన అక్కకు 54 సర్జరీలు చేశారు!
Updated : Mar 22, 2021
కంగనా రనౌత్ అక్కయ్య రంగోలి చందేల్ యాసిడ్ దాడికి గురైన విషయం తెలుసా? ఆ దాడి తర్వాత ఐదేళ్ల కాలంలో ఆమెకు 54 సర్జరీలు అవసరమయ్యాయని తెలుసా? అవును. ఈ దిగ్భ్రాంతికర నిజాలను వరుస ట్వీట్స్ ద్వారా రంగోలి వెల్లడించారు. ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న వ్యక్తిని కాదన్నందుకు ఆమెపై అతను యాసిడ్తో దాడి చేశాడు. యాసిడ్తో ఆమె ముఖంపై ఒక వైపు, మెడ, వక్షస్థలం తీవ్రంగా కాలిపోయాయి. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకు తమ ముఖం ఎలా ఉండేదో ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
ఆ ఘటన తర్వాత భౌతికంగా, భావోద్వేగపరంగా ఆమె అనుభవించిన నరకాన్ని అర్థం చేసుకోవడం బహుశా ఎవరికైనా కష్టమే. పూర్తిగా సరిచేయడానికి వీలుకానంతగా తన ముఖం డామేజ్ అయ్యిందని ఆమె చెప్పారు. "నేనో కంటిని కోల్పోయాను. ఒక రెటీనా మార్పిడి జరిగింది. తీవ్రంగా డామేజ్ అయిన నా రొమ్మును బాగు చేయడానికి డాక్టర్లు నా శరీరంలోని పలు ప్రాంతాల నుంచి స్కిన్ను తొలగించారు. ప్రీతు (కుమారుడు)కు పాలిచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నాను." అని ఆమె రాసుకొచ్చారు.
ఐదేళ్ల తర్వాత కూడా ఆమె చెవిని పునరుద్ధరించడంలో డాక్టర్లు సక్సెస్ కాలేకపోయారు. ఆ విషయం ఆమె షేర్ చేసిన ఫొటోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆ భయానక అనుభవం నుంచి, ఆ తర్వాత జరిగిన ట్రీట్మెంట్, సర్జరీల నుంచి రికవర్ కావడంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, భర్త సపోర్ట్ ఎంతో ఉందని ఆమె తెలిపారు.
"ఏం చెప్పాలో నాకు తెలీదు. నిజాయితీగా చెప్పాలంటే, నా జీవితాన్ని వదిలేసుకున్నాను. అప్పటికి నాకు ఓ మామూలు ఫ్రెండ్ అయిన నా భర్త, నా గాయాలను శుభ్రంచేసి, సంవత్సరాల తరబడి ఆపరేషన్ థియేటర్ల బయట వెయిట్ చేస్తూ వచ్చాడు. నా సోదరి (కంగన), నా తల్లిదండ్రులు కలిసి నాకు ఊపిరి నిచ్చారు. ఈరోజు నా లైఫ్ ఇలా ఉందంటే.. ఆ క్రెడిట్ని నేను తీసుకోలేను." అని రాసుకొచ్చారు రంగోలి.
ఆమె డెహ్రాడూన్లో ఇంజనీరింగ్ చదువుకొనేటప్పుడు ఈ దాడి జరిగింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో కాలిపోయిన ఆమె శరీర భాగాల్ని సరిచేయడానికి 54 సర్జరీలు అవసరమయ్యాయి. ఎడమ కంటి రెటీనాను మార్చారు. అయినప్పటికీ ఆమె ఎడమ చెవిని మామూలుగా మార్చలేకపోయారు డాక్టర్లు.