English | Telugu
దివ్యభారతి తండ్రి మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ఆమె భర్త!
Updated : Nov 1, 2021
నిన్నటి తరం ప్రేక్షకుల ఆరాధ్య తార దివ్యభారతి తండ్రి ఓంప్రకాశ్ భారతి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను దివ్యభారతి భర్త, బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సాజిద్ నదియడ్వాలా నిర్వహించారు. వయోభారంతో ఇబ్బందిపడుతూ వచ్చిన ఓంప్రకాశ్ అక్టోబర్ 30 (శనివారం) తుది శ్వాస విడిచారు. ఆయన చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులతో పాటు సాజిద్ కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అంతే కాదు, ఓంప్రకాశ్ అంత్యక్రియలను తనే స్వయంగా నిర్వహించిన సాజిద్, కుటుంబ సభ్యులతో పాటు అంజలి ఘటించారు.
దివ్యభారతితో పెళ్లయిన రోజు నుంచే ఆమె తల్లితండ్రులు మీతా భారతి, ఓంప్రకాశ్ భారతిలను తనవాళ్లుగా పరిగణిస్తూ వస్తున్నారు సాజిద్. కేవలం 19 ఏళ్ల వయసులో దివ్యభారతి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి మృతి చెందినప్పట్నుంచీ వారికి మరింత సన్నిహితంగా ఉంటున్నారు. వారికి కొడుకులాగా మారి, వారికి సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఓంప్రకాశ్ మృతితో, అత్తయ్య మీతా భారతి ఆరోగ్యంపై సాజిద్ దృష్టి పెట్టినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
నిజానికి దివ్యభారతి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు అందరి వేళ్లూ సాజిద్వైపు తిరిగాయి. అయితే సాజిద్ మాత్రం ఆమె కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. సన్నిహితులు తెలిపిన దాని ప్రకారం దివ్య పేరెంట్స్ను తన పేరెంట్స్లా ఆయన చూసుకుంటారు. వారిని ఆయన అమ్మ, నాన్న సంబోధిస్తుంటారు. ఇప్పుడు ఓంప్రకాశ్ మరణించడంతో ఒక కొడుకు లాగా మీతా భారతి బాధ్యతలను ఆయన చేపడుతున్నారు.
1992 మేలో దివ్యభారతి, సాజిద్ పెళ్లి జరిగింది. ఏడాది తిరిగే లోపే దేశం మొత్తాన్ని షాక్కు గురిచేస్తూ, 1993 ఏప్రిల్లో ముంబైలో తను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి మృతి చెందింది దివ్యభారతి. ఆమె మృతి అనేక అనుమానాలకు తావిచ్చింది, అనేక కథనాలను సృష్టించింది. ఏడేళ్ల తర్వాత వార్దా ఖాన్ అనే జర్నలిస్టును రెండో పెళ్లి చేసుకున్నారు సాజిద్.