English | Telugu
సీత పాత్రలో కరీనా కపూర్!
Updated : Mar 13, 2021
నిన్న ఒక పెద్ద ఎనౌన్స్మెంట్ వచ్చింది. శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీలో సీత పాత్రధారిగా కృతి సనన్ ఎంపికవగా, లక్ష్మణునిగా సన్నీ సింగ్ నటించనున్నాడు. సందర్భవశాత్తూ రామాయణం ఆధారంగా మరో రెండు సినిమాలు కూడా రంగంలో ఉన్నాయి. నిర్మాత మధు మంతెన రామాయణంపై భారీ బడ్జెట్తో 3డి మూవీని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీలో సీతగా దీపికా పడుకోనే, రావణునిగా హృతిక్ రోషన్ నటించనున్నారు. శ్రీరామ పాత్రధారి ఎంపికే ఫైనల్ కాలేదు. ఈ రెండు కాకుండా, ఇటీవల 'బాహుబలి' రైటర్ విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్తో 'సీత.. అవతారం' అనే మూవీని డైరెక్టర్ అలౌకిక్ దేశాయ్ ప్రకటించాడు.
ఈ మూవీలో టైటిల్ రోల్ను పోషించడానికి చాలా మంది తారలు ఆసక్తి చూపుతుండగా, మేకర్స్ మాత్రం కరీనా కపూర్ను ఎంచుకున్నారని సమాచారం. సీత పాత్రకు కరీనా అయితేనే న్యాయం చేస్తుందని డైరెక్టర్ అలౌకిక్, రైటర్ విజయేంద్రప్రసాద్ భావిస్తున్నారు. "వారి రామాయణ గాథ సీత దృష్టికోణం నుంచి నడుస్తుంది. ఇదే కథతో తయారవుతున్న ఇతర రెండు సినిమాలతో పోలిస్తే ఇది భిన్నమైంది. అలియా భట్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది కానీ, వారు మొదట సంప్రదించింది కరీనానే." అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
"టైటిల్ రోల్ కావడం, భిన్నమైన ఐడియా కావడం, ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో కరీనా ఈ స్క్రిప్ట్ను ఇష్టపడింది. డేట్లు, రెమ్యూనరేషన్ విషయమై నిర్మాతలతో కరీనా టీమ్ చర్చలు జరుపుతోంది. చర్చలు కొలిక్కి రాగానే సీతగా ఆమె నటించడంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఒకవేళ కరీనాతో వర్కవుట్ కాకపోతే, సెకండ్ ఛాయిస్గా అలియా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చే అవకాశం ఉంది." అని కూడా ఆ వర్గాలు తెలిపాయి.