English | Telugu
వరుణ్తో దిల్ రాజు బాలీవుడ్ మూవీ.. రంగంలోకి శైలేష్
Updated : Aug 14, 2023
తెలుగు సినీ ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో హిట్ సినిమాను హిందీలో నిర్మించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో హీరో ఎవరో కాదు.. వరుణ్ ధావన్. మరి దర్శకుడు ఎవరో కాదు.. శైలేష్ కొలను. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అయిన హిట్, హిట్ 2 సినిమాలను తెరకెక్కించి వరుస విజయాలను ఈ డైరెక్టర్ సొంతం చేసుకున్నారు. ఇప్పడు విక్టరీ వెంకటేష్తో సైంధవ్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇది మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కనుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సినిమాను నిర్మిస్తోంది.
దీని తర్వాత వరుణ్ ధావన్, దిల్ రాజు కాంబినేషన్లో రూపొందనున్న సినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్నారు. హిందీలో హిట్ రీమేక్ను కూడా శైలేష్ కొలను తెరకెక్కించారు. శైలేష్ కొలను ఇప్పుడు వరుణ్ ధావన్తో చేయబోయే సినిమా కొత్త సబ్జెక్టా లేక హిట్ 2 రీమేకా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. నిజానికి వెంకటేష్తో చేస్తోన్న సైంధవ్ సినిమా తర్వాత హిట్ 3 సినిమాను తెలుగులో శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ వరుణ్ ధావన్తో సినిమాను చేయబోతున్నారు.
నాని వరుస సినిమాలో కథానాయకుడిగా బిజీగా ఉన్నారు. అందుకనే హిట్ 3 సినిమాను ఇంకా ట్రాక్ ఎక్కించలేదు. హిట్, హిట్ 2 సినిమాలను నాని నిర్మించారు. అయితే హిట్ 3లోనాని హీరోగా నటిస్తూ నిర్మించబోతున్నారు.
