English | Telugu
ఒంట్లో బాగాలేదని ఎన్సీబీ విచారణకు డుమ్మా కొట్టిన అనన్య!
Updated : Oct 25, 2021
సోమవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముందు విచారణకు హాజరు కావాల్సిన బాలీవుడ్ భామ అనన్యా పాండే డుమ్మా కొట్టింది. తనకు మరింత సమయం కావాలని ఆమె కోరింది. ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్ కేసులో భాగంగా ఆమె ఇప్పటికే రెండుసార్లు ఎన్సీబీ ఎదుట హాజరైంది. ఈ కేసులో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయగా, అతను ఆర్థర్ రోడ్ జైలులో రిమాండ్లో ఉన్నాడు. అతనితో అనన్య వాట్సాప్ చాట్స్లో డ్రగ్స్ గురించి సంభాషించిందనే అభియోగంతో ఆమెను ఎన్సీబీ విచారిస్తోంది.
సోమవారం తమ ముందు మరోసారి హాజరు కావాలని 22 ఏళ్ల అనన్యను ఎన్సీబీ కోరింది. అయితే తనకు మరో తేదీ కావాలని అనన్య రిక్వెస్ట్ చేసింది. "అనన్యా పాండేకు ఒంట్లో బాగాలేదు. అందుకని సమయం అడిగింది." అని ఎన్సీబీ డిప్యుటీ డైరెక్టర్ జనరల్ ముత్త అశోక్ జైన్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఏదో ఒకరోజు ఆమెను పిలవనున్నట్లు ఆయన చెప్పారు.
ఇంతకుముందు గురువారం రెండు గంటలు, శుక్రవారం నాలుగు గంటల సేపు ఆమెను ఎన్సీబీ విచారించింది. ఆర్యన్ ఖాన్ మొబైల్ నుంచి సేకరించిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ఆమెను ఎన్సీబీ విచారిస్తోంది. తానెప్పుడూ మాదక ద్రవ్యాలను వాడలేదనీ, ఆర్యన్తో సరదాగా తాను వాటి గురించి మాట్లాడానని ఆమె చెప్పినట్లు సమాచారం.