Read more!

English | Telugu

రణబీర్-యశ్ ల 'రామాయణ'లో అమితాబ్, విజయ్, రకుల్..!

రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్' నిరాశపరిచినప్పటికీ.. రామాయణాన్ని మరోసారి వెండితెర మీదకి తీసుకురావాలని బాలీవుడ్ ప్రయత్నిస్తోంది. 'దంగల్' ఫేమ్ నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'రామాయణ' చిత్రం కొంతకాలంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు రంగంలోకి దిగుతుండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

అధికారిక ప్రకటన రానప్పటికీ.. 'రామాయణ'లో ముఖ్యమైన పాత్రల ఎంపిక దాదాపు పూర్తయిందని సమాచారం. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తుండగా.. దశరథుడిగా అమితాబ్ బచ్చన్, హనుమంతుడిగా సన్నీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతి, సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇలా సినిమాలో అన్ని ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటీనటులనే రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి. మరి ఈ భారీ తారాగణానికి తగ్గట్టుగా రామాయణానికి నితేష్ తివారి అద్భుతమైన తెరరూపం తీసుకొస్తే మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించే అవకాశముంది.

ఈ ఏడాది వేసవిలోనే రామాయణ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.