Read more!

English | Telugu

పూనమ్‌ పాండేపై రూ.100 కోట్లకు దావా!

కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడం కంటే ఏదో విధంగా వార్తల్లోకి వచ్చి పాపులర్‌ అవ్వాలనుకుంటారు. అలాంటి వారిలో పూనమ్‌ పాండే పేరును మొదటిగా చెప్పుకోవచ్చు. చాలా కాలం నుంచి రకరకాలుగా వార్తల్లోకి రావాలని ప్రయత్నించిన పూనమ్‌ ఈసారి ఏకంగా తాను చనిపోయినట్టుగా నాటకమాడి అందరికీ షాక్‌ ఇచ్చింది. కాన్సర్‌ గురించి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్టు వార్త సృష్టించానని చెబుతోంది. అయితే ఈ విషయంలో కొంతమంది ఆమెను సపోర్ట్‌ చేసినా ఎక్కువ శాతం ఆమె చర్యను విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. పూనమ్‌ చేసిన పనికి ఆగ్రహించిన ఓ వ్యక్తి ఆమెపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. కాన్పూర్‌కి చెందిన అన్సారీ అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో కేసును ఫైల్‌ చేసి ఆమె మీద, ఆమె భర్త సామ్‌ బాంబేలపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు పెట్టారు. క్యాన్సర్‌ అవగాహన పేరుతో ఇలాంటి మోసానికి పాల్పడిన ఆ ఇద్దరినీ అరెస్ట్‌ చెయ్యాలని డిమాండ్‌ చేశాడు అన్సారీ. కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఆరోపించాడు. భార్యాభర్త కలిసి చేసిన ఈ పనివల్ల ఎంతో మంది ప్రజలు ఆవేదనకు గురయ్యారని, వారి మనోభావాలతో ఆడుకున్న పూనమ్‌, సామ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అలాగే పరువు నష్టం కేసుపై పూనమ్‌, ఆమె భర్త ఇప్పటివరకు స్పందించలేదు.