Facebook Twitter
కోవిడ్ తో కొత్త జీవితాలు....

కోవిడ్ తో జీవితాలు

కొత్తరూపు దిద్దుకుంటున్నాయి

 

ఓ మనిషీ ! 

ఇకనుండి నీ అడుగులు

అభివృద్ధి శిఖరం పైపా

అధఃపాతాళపు

అంచులలోకా ఆలోచించుకో

 

ఓ మనిషీ ! నీవింకా 

దానవత్వంలోనే 

దగ్దమైపోతావో

దాతృత్వంతో దానకర్ణుడిలా

మిగిలిపోతావో తేల్చుకో

 

ఓ మనిషీ ! నీవు 

నీ జీవితసాగరాన

గట్టున తిరుగుతూ

గవ్వలు ఏరుకుంటావో

మునిగి ముత్యాలు 

సొంతం చేసుకుంటావో తేల్చుకో

 

ఓమనిషీ ! ఇక నుండైనా నీవు 

నీ కుటుంబంతో కలిసి 

కులాసాగా ఖుషీగా వుంటావో

వీధుల్లో గంగిరెద్దులా

ఊరేగుతూ వుంటావో తేల్చుకో

 

ఓమనిషీ ! ఇంకా నీవు

కఠినమైన మాటలతో 

కంఠంలో విషాన్ని ప్రదర్శిస్తావో

మధురమైన మంచివాక్కులతో 

మనసుల్ని నింపుతావో తేల్చుకో

 

ఓ మనిషీ ! ఇకనైనా నీవు

అడ్డమైనదారుల్లో వెళ్ళి 

గడ్డిమేసే గుడ్డిగాడిదను గుర్తుచేస్తావో 

నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా వుండే

మండే నిప్పురవ్వలకు నిజరూపమౌతావో తేల్చుకో

 

భుకంపమంటే ప్రకోపించిన ప్రకృతి చేసే వికృత చేష్ట

యుద్దమంటే రక్త చరిత్ర కరోనా అంటే శవాల యాత్ర

ఔను జరిగి తీరాలి మనిషి మనుగడలో వింత విభజన

కోలీవుడ్ కు ముందు బ్రతుకు కోవిడ్ తర్వాత బ్రతుకని

 

476-27.వలస పక్షులు....

 

ఉద్యోగులు కొందరు లాక్ డౌన్ పుణ్యమాని

ఉరుకు పరుగుల ఉద్యోగం మాని

ఇంట్లోనే వుంటూ భార్యాపిల్లలతో 

ఖరీదైన కుక్కపిల్లలతో ఆడుకుంటూ,కోరిందితింటూ

టీవీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా వున్నారు

కానీ,వలసకూలీలు కొందరు

చేతికి పనిలేక, తినడానికి తిండి లేక

ఆదుకునే నాధుడు లేక

పిల్లాపాపలతో ఆకలికి అల్లాడిపోతున్నారు

అస్థిపంజరాలైపోతున్నారు, అందుకే

ఏంచేయాలో దిక్కు తోచక

మూటాముల్లె సర్దుకొని, వేల

కీలోమీటర్లు నడుచుకుంటూ

పిల్లాపాపలతో, ఏడ్చుకుంటూ

కాళ్ళీడ్చుకుంటూ, అక్కడక్కడ ఆగి

పంపునీళ్ళతో కడుపు నింపుకుంటూ

ఉపాధిదొరక్క పక్షుల్లా ఉత్తరాంధ్ర కెగిరిపోతున్నారు

నిజమే వీరు లాక్ డౌన్ తో 

రెక్కలు విరిగిన పక్షులయ్యారు

గాఢాంధకారంలో తిరిగే గబ్బిలాలయ్యారు

వాడిపోతున్న పూలదండలయ్యారు

పగిలిపోతున్న పాలకుండలయ్యారు

చెత్త కుండీల దగ్గర ఎంగిలి మెతుకుల కోసం 

ఎదురుచూసే కుక్కలయ్యారు

నిన్నగుభాళించి నేడెండిపోయే పూలమొక్కలయ్యారు

తిరిగి తిరిగి అరిగిపోయిన కాలి చెప్పులయ్యారు

అందరూ త్రాగి వాడిపడేసిన కాఫీకప్పులయ్యారు

వీరు కరిగిపోయే కొవ్వొత్తులయ్యారు

వీరు ఆకలితో ఆరిపోయే దీపాలయ్యారు 

ఔను లాక్ డౌన్ కొందరికీ శ్రీరామ రక్ష

కాని ఉత్తరాంధ్ర వలసపక్షులకిది జీవన్మరణశిక్ష

 

(ఓ నిండుగర్భిణి 500కి. మీ ప్రయాణానికి సిద్ధమైందన్న

వార్తా చదివి , ఆ వలసకూలీలకు, ఆ శ్రమజీవులకు చేతిలెత్తిమొక్కుతూ....వ్రాసిన కవిత)