గర్భగుడిలో ప్రతిష్టించిన
శివుని శిల్పం మనిషి చెక్కినదే
దేవుడు సృష్టించిన మనిషే తిరిగి
దైవాన్ని సృష్టిస్తున్నాడు ఇది ?
విల్లాలు,ఎంత వింత?
మనిషి ఉలితో చెక్కిన ఆ సుందర శిల్పానికి
ఉలుకూ లేదు పలుకూ లేదు ఊపిరి లేదు
తల్లి గర్బంలో తొమ్మిది నెలలుండి
ఆపై తల్లి పేగు తెంచుకొని
రక్తం పంచుకొని పుట్టి పెరిగిన బిడ్డ
ఈ తల్లిదండ్రి తనకు జన్మనిచ్చారే
కానీ ప్రాణం పోయలేదని...తెలుసుకొని
ప్రాణం పోసిన ఆ పరమాత్మనే
ప్రశ్నిస్తున్నాడు ఓ దైవమా నీవెక్కడని?
అందుకు దేవుడు
నే నెక్కడో లేను
నీలోనే వున్నాను
నీ ఆత్మలో వున్నాను
నీ శ్వాసలో నేవున్నాను
నీ కంటికి వెలుగైవున్నాను
నేను లేకుంటే నీవు లేవన్నాడు
నీనుండి నేనెళ్ళిపోతే
నీ గుండె ఆగిపోతుంది
నీ కళ్ళు మూతపడతాయి
నీవు కట్టైపోతావు
కాటికెళ్తావు కాలిబూడిదైపోతావు
భూమిలో కలిసిపోతావన్నాడు
అందుకే ఓ మనిషీ...
నీవు శిల్పినంటావు శిల్పాలు చెక్కుతావు
ప్రగల్పాలు పలుకుతావు ఐతే
నీకు నేను ఉలినైతే ఇచ్చాను కాని
ఊపిరిపోసే శక్తినివ్వలేదనిగుర్తుంచుకోమన్నాడు
అంతే ఆ మనిషిలో...
జ్ఞానదీపం వెలిగింది జ్ఞానోదయమైంది
గర్వాంధకారం తొలిగింది తాను
గడ్డిపోచకన్న మిన్నకాదన్న సత్యమర్థమైపోయింది



