అమ్మా ! ఓ న్యాయదేవతా! ఇదెక్కడి న్యాయం ?
ఇదెక్కడి ఘోరం ? ఇదెక్కడి ధర్మం తల్లీ ?
"నాలుగు పులులు" ఒక అమాయకపు జింకను
ఎందుకు వేటాడుతాయి? రక్తం త్రాగడానికే కదా !
ఎందుకు సంహరిస్తాయి? ఆకలి తీర్చుకోవడానికే గదా !
ఆ పులుల నోట రక్తపు చుక్కలు రాలుతున్నా
ఆ పులులముందే ఎముకలు గుట్టలుగా పడివున్నా
"గుంటనక్కలు" కొన్ని గుర్తులేమీ లేవంటున్నాయి
అసలక్కడ ఏ దారుణం జరగలేదంటున్నాయి
పాపం ఆ పులులు ఏ పాపం ఎరగవని
వేటగాడెవరో చాటుమాటుగా బాణం వేసి
జింక ప్రాణం తీశాడని రిపోర్టు లిచ్చేస్తున్నాయి.........
హాథ్రాస్ లోనూ అదే "మృగనీతి" అర్థరాత్రిలో
అంత్యక్రియలు""అత్యాచారం జరగలేదని రిపోర్టులు"
ఛీ ! ఛీ ! వీరు అధికారులా? కాదు కాదు
"ఊసరవెల్లులు"..."మేకవన్య పులులు"...
"తేనెపూసిన కత్తులు..."ప్రభుత్వానికి తొత్తులు."..
నిజమే నిర్భయలాంటి చట్టాలెన్ని చేసిలాభమేమి?
రాజ్యాంగం హక్కులెన్ని కల్పించి లాభమేమి?
కామాంధుల విషపుకోరలను విరిచేందుకు, చక్కని
మార్గమొక్కటే "నైజీరియా ప్రభుత్వ విధానం"
"దోషుల పురుషత్వాన్ని తక్షణమే తొలిగించడం"....
"చచ్చేంత వరకు వారు జీవశ్చవాల్లా బ్రతకడం......
అట్టి చట్టమేలే స్త్రీ జాతికి శ్రీరామరక్ష...
అదే ఈ కామాంధులకు అసలైన సిసలైనశిక్ష...



