మూగ గొంతులతో కాదు...
మువ్వన్నెలజెండా చేబూని
అహింసామూర్తి
జాతినేత జాతిపిత మన
బాపూజీ సారధ్యంలో
వందేమాతర మంటూ
క్విట్ ఇండియా అంటూ
దిక్కులు పిక్కటిల్లేలా
నినదించిన నిప్పులు
కురిపించిన గళాలతో
వచ్చిందే...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం...
పిరికి పిడికిళ్లతో కాదు...
బిగించిన ఉక్కు పిడికిళ్ళతో
మృత్యువును ముద్దాడేందుకు
సిద్ధమైన విప్లవ వీర కిషోరాలతో
స్వాతంత్ర్య సమర యోధులతో
ఎందరో జాతినేతల ప్రాణత్యాగాలతో
వచ్చిందే...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం...
పిరికి పందలతో కాదు...
ఎందరో విప్లవవీరులు
గర్జించే కొదమసింహాలై
గండ్రగొడ్డళ్ళు చేపడితేనే
అదరక బెదరక ఎదురిస్తేనే
తెల్లవారి గుండేల్లో నిదురిస్తేనే
తెల్లదొరల తలలు తెగనరికితేనే
వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం...
స్వార్థపరులతో కాదు...
బానిసత్వంలో బంధించి
మానవ హక్కులను కాలరాసే
చిత్ర హింసలకు గురిచేసే
తెల్ల కుక్కల భరతంపట్టిన
భయమన్నది ఎరుగని
మన భరతమాత ముద్దుబిడ్డలు
భగభగమండే భాస్కరులై
ఖణఖణమండే నిప్పుకణికలైన
భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లు
అతిపిన్న వయసులో అసువులుబాస్తేనే
వచ్చింది...ఈ అర్థరాత్రి స్వాతంత్ర్యం...
ఈ స్వాతంత్ర్య ఫలాలు దేశప్రజలందరికి
అందాలంటే...సమానత్వం సౌభ్రాతృత్వం
స్వేచ్ఛను అందరూ సమానంగా పొందాలంటే...
రాజ్యాంగహక్కులు ప్రతిఒక్కరికీ దక్కాలంటే...
నిన్న అధికారం చేజిక్కి అందలమెక్కి, నేడు
నాట్యమాడే "నల్లదొరల భరతం" పట్టడమే
ప్రజాశ్రేయస్సు కోరే ప్రతిపౌరుని ప్రథమకర్తవ్యం
అందుకు "బ్రహ్మాస్త్రం ఒక్కటే" అదే మన "ఓటుహక్కు"
ఔను ఇది నిజం...ఎవ్వరూ కాదనలేని పచ్చినిజం
కారుచీకట్లు కమ్మితేనేమి ? చైతన్యం జ్వలిస్తే చాలు
కలిసి,"పోరుబాట" పట్టినచాలు"పొడిచేది తొలిపొద్దే"



