భూమ్యాకాశాల్ని...
సూర్యచంద్రుల్ని
ఎనభై నాలుగు లక్షల...
జీవరాశుల్ని
97 శాతం...
ఉప్పునీటి సముద్రాలను...
2 శాతం...
మంచు పర్వతాలను...
ప్రాణికోటి దాహం...
తీర్చుకునేందుకు
1 శాతం...
త్రాగునీటిని
భూగర్భంలో దాచిన
ఓ పరమాత్మా ! మీ సృష్టి
ఎంత వింతసృష్టియో కదా!
మనిషి బ్రతుకును
మార్చేది...అక్షర దీపమే...
ఆకలిని తీర్చేది...పరబ్రహ్మ
స్వరూపమైన...ఆహారమే...
కానీ ప్రాణికోటికి దాహాన్ని
తీర్చేది.....భూగర్భజలమే...
కనిపించనివి రెండే...
కాలం...భూగర్భజలం
అడుగంటిన ఆ జలం...
భూగోళం...గందరగోళం
విశ్వమంతా విలవిలా...
ఈ ప్రాణికోటి గిలగిలా...
చెరువుల పూడికతో చెక్
డ్యామ్ ల ఇంకుడు గుంతల...
నిర్మాణాలతో భూగర్భ జలం
పెరిగిన నాడే జగతిలో ప్రగతి
సంరక్షించిన
ప్రతి నీటిచుక్క...పాలచుక్కే
కలుషితమైన
ప్రతి నీటిచుక్క...కన్నీటిచుక్కే
దోసిలితో ఒడిసిపట్టిన
ప్రతి నీటిచుక్క...తేనెచుక్కే
వృధాగా విడిచిపెట్టిన
ప్రతి నీటిచుక్క....విషపుచుక్కే
జగతికి జీవనాధారం నీరే...
ప్రగతికి మూలాధారం నీరే...
నీరే కదాని వృధాచేస్తే...ఇక
భావితరాలకు మిగిలేది కన్నీరే...
ఔను తమిళనాడులో...
వెల్లూరులో...నాగానదిలో
20 000 మంది స్త్రీలు...
3500 బావులను తవ్వి
ఎండిపోయిన నాగానదికి జీవంపోసి...నీటికొరతను
తీర్చి నిజమైన జలశక్తికి నిదర్శనంగా...ప్రపంచానికి
ఆదర్శంగానిలిచిన ఆ మహిళా
మణిరత్నాలకు సెల్యూట్ చేద్దాం...
రేపటిరోజున త్రాగునీటికోసం
యుద్ధాలు జరగవచ్చు...జనం
నీరులేక స్నానాలకు రసాయన
లేపనాలను రాసుకోవచ్చు...
అందుకే జలసంరక్షణే...
జనసంరక్షణనకు...రాజమార్గం
సంరక్షించిన భూగర్భజలం...
మన బ్రతుకే భూతల స్వర్గం...



