మొన్న అయోధ్యలో అల్లర్లురేపి
నిన్న భాగ్యనగరం నడిబోడ్డులో బాంబులుపేల్చి
శాంతిదూతయైన గౌతమబుద్దుని సాక్షిగా
అమాయకుల్ని హతమార్చి అశాంతిని సృష్టించి
కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా
నిత్యం ఆరనిమతచిచ్చును రగిలిస్తూ
రక్తపుటేరుల్లో స్నానం చేసే ఓ రాక్షసుల్లారా!
ఎవరు ముస్లిం? ఎవరు హిందువు ?
ఎవరు క్రిస్టియన్ ? ఎవరు సిక్కు ?
ఎవరిచ్చారు మీకీ ప్రజాస్వేచ్చను హరించేహక్కు?
క్షమకు కరుణకు ప్రేమకు ప్రతిరూపమైన
ఆ క్రీస్తు కోరునా కిరాతకం... లేదే
శత్రువులు చేజిక్కినా ఏహాని తలపెట్టని
ఆ రఘురాముడు కోరునా రక్తాభిషేకం... లేదే
యుద్దమంటే జీవహింసని ప్రజల రక్తప్రవాహమని
శాంతిని ప్రభోదించిన ఆ అల్లా కోరునా అల్లకల్లోలం...లేదే
మరి జీహాదేమిటీ ?
జీహాద్ పేర ఈ జీవహింస ఏమిటి ?
మతంపేరిట ఆ మారణహోమమేమిటి ?
నిన్నమతం ...ఒక మత్తుమందు...
నేడు ఆపేరు...ఎత్తితేనే రక్తం చిందు...
మతంమత్తులో జోగే ఓ మతోన్మాదుల్లారా!
మీకిదే నా శాంతిసందేశం ...గుర్తుంచుకోండి
మనకు కావలసింది మతంకాదు మానవత్వం మనం
మనిషిలో దర్శించాల్సింది దానవత్వం కాదు దైవత్వం
మన సుఖజీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వం
అది ఒక్క మతసామరస్యంతోనే సాధ్యం ఇది నగ్నసత్యం
మతసామరస్యమే ఈమట్టిమనిషి పురోగతికి గట్టిపునాది



