సీఎం చంద్రబాబుకు యువగళం పుస్తకం అందించిన లోకేశ్

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలో లోకేశ్ తన తండ్రి పాదాలను నమస్కరించారు. తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని మహనాడు సందర్బంగా ముఖ్యమంత్రికి ఇవ్వడం సంతోషంగా ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.