ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ..సెల్‌ఫోన్‌ సీజ్‌కు అధికారుల యత్నం

 

ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని కేటీఆర్‌ను కోరినట్లు  తెలుస్తోంది. కేటీఆర్‌ సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఇవాళ విచారణకు సెల్‌ఫోన్‌ తీసుకురాలేదని మాజీ మంత్రి తెలిపారు. ఈ-రేసు సమయంలో వాడిన సెల్‌ఫోన్లను అప్పగించాలని కేటీఆర్‌ను అధికారులు ఆదేశించారు. 

ఈ నెల 18లోపు సెల్‌ఫోన్లను అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ అనంతరం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ను వెళ్లారు.పార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించడం ఇది రెండో సారి. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, మంత్రి వర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారన్న అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవోకు పంపామని ఇందులో తాను ఎక్కడా లబ్ది పొందలేదని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.