యోగీ ..అన్నంత పని చేసేశారు!
posted on Apr 14, 2023 10:43AM
ఉత్తర ప్రదేశ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. లోక్ సభ మాజీ ఎంపీ, ప్రస్తుతం జైల్లో ఉన్నగ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హత మార్చారు. ఈ సంఘటన ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
నిజానికి యోగీ ఆదిత్య నాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూపీలో బాహుబలులు గా చెలామణి అవుతున్న గ్యాంగెస్టర్లను ఏరి పారేయడంలో పాత రికార్డులు అన్నిటినీ తుడిచేశారు. అనేక మంది పేరు మోసిన గ్యాంగెస్టర్లలో సరెండర్ అయిన వాళ్ళు అయ్యారు. కాదంటే ఎన్ కౌంటర్లలో ఖతం అయ్యారు. ముఖ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హంతకులకు అసెంబ్లీ వేదికగానే గట్టి హెచ్చరిక చేశారు. న్యాయవాది బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి, ఉమేష్ పాల్ ను ప్రయాగ రాజ్ లో హత్య చేసిన హంతకులను మట్టిలో కలిపేస్తా ( మిట్టీ మే మిలాదేంగా) అనే హెచ్చరించారు.
అంతే కాదు అనట్లుగానే ఒక్కో నిందితుడిని ఏరిపారేస్తూ యూపీలో మాఫియాను భూస్థాపితం చేస్తున్నారు. తాజాగా గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్కౌంటరే అందుకు ఉదాహరణ. ఉమేశ్ పాల్ హత్య కేసును సవాల్గా తీసుకున్న యూపీ పోలీసులు ప్రధాన నిందితుడైన అసద్ కోసం 50 రోజుల పాటు రాష్ట్రమంతా జల్లెడపట్టారు. చివరకు ఝాన్సీలో అతడిని తుదముట్టించారు.
గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అహ్మద్. తన ఇద్దరు అన్నలు మరో కేసుల్లో పోలీసులకు లొంగిపోవడంతో అతీక్ మాఫియా పనులను చూసుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య వ్యవహారంలో సాక్షి ఉమేశ్పాల్పై అతీక్ కుటుంబీకులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఉమేశ్ను హత్య చేసేందుకు అతీక్ జైలు నుంచే పథకం రచించగా.. దాన్ని అసద్ అమలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేని అసద్.. ఉమేశ్ పాల్ హత్య నాటి వరకు యూపీ పోలీసుల రాడార్లో లేడు. ఆ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో అసద్ కనిపించడంతో పోలీసులు అతడిపై దృష్టి సారించారు.
ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లో ఉమేశ్ తన ఇంటి ఎదుటే దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యను అసద్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో అతడు అక్కడే కారులో ఉండటమే గాక.. ఉమేశ్ ఇంట్లోకి పారిపోతుండగా వెనక నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి అసద్ పరారీలో ఉన్నాడు.
అసద్ కోసం దాదాపు 50 రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఒకానొక సమయంలో అతడు నేపాల్ పారిపోయినట్లు సమాచారం రావడంతో ఆ దేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మరోవైపు అసద్ మొబైల్ ఫోన్లు ఉపయోగించకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. హత్య తర్వాత లఖ్నవూ పారిపోయిన అసద్.. అక్కడ నుంచి కాన్సూర్, మీరట్, ఢిల్లీ ఇలా పలు ప్రాంతాల్లో నక్కినట్లు దర్యాప్తులో తెలిసింది. తాజాగా అతడు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. మరోవైపు, ఉమేశ్ పాల్ హత్య కేసులో విచారణ నిమిత్తం అసద్ తండ్రి అతీక్ను నేడు ప్రయాగ్ రాజ్ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే అతీక్ను తరలించే పోలీసు కాన్వాయ్పై దాడి చేసి వారిని తప్పించేందుకు అసద్ కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
ఈ క్రమంలోనే అసద్ కోసం ఝాన్సీలో గాలిస్తుండగా.. ఓ బైక్పై మరో నిందితుడు గుల్హామ్తో కలిసి వెళ్తూ కన్పించాడు. పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో 12 మంది బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది. ఎన్కౌంటర్ సమయంలో మొత్తం 42 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా, గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపారు. 2017 మార్చి నుంచి ఇప్పటివరకు యూపీ పోలీసులు 178 మంది క్రిమినల్స్ను ఎన్కౌంటర్లో చంపేశారు. అంటే గత ఆరేళ్లలో ప్రతి 13 రోజులకో నేరస్థుడు హతమయ్యాడు. ఇదే కాలంలో 23,069 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్స్ జరిపిన ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు అమరులయ్యారు. నిజానికి, 2022 ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడంలో మాఫియా, గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపాడం కూడా ఒక కీలక అంశం.