ఐనవోలులో కనువిందు చేసిన పసుపు పచ్చ కప్పలు
posted on Jul 23, 2025 3:59PM

దెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదురా అన్నాడు సుమతీ శతకకారుడు. వర్షాకాలంలో కప్పల బెకబెకలు వినని వారుండరు. అయితే మనం తరచుగా చూసే కప్పలన్నీ గోధుమరంగు, ముదురు ఆకుపచ్చ, నలుపు రంగులలోనే ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా రంగులలో కప్పులు ఉన్నాయని చదువుకున్నాం. అయితే వర్షాలు కురిసినప్పుడు మాత్రమే బయటకు వచ్చి.. ఆ తరువాత భూమి లోపలే ఆవాసాలు ఏర్పరుచుకునే కప్పులు ఉన్నాయి. వాటిలో అత్యంత అరుదైనవి పసుపు పచ్చని కప్పలు. ఈ కప్పలు ఎప్పుడో కానీ కనిపించవు. అయితే ఇవి భూమిపైకి వచ్చి కనిపించాయంటే.. ఆ ప్రాంతంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని జనం విశ్వసిస్తారు.
అటువంటి అత్యంత అరుదైన పసుపు పచ్చని కప్పలు ఉమ్మడి వరంగల్ జిల్లలోని ఐనవోలులో బుధవారం (జులై 23) దర్శనమిచ్చాయి. ఐనవోలులేని మల్లికార్జున స్వామి దేవాలయ సమీపంలో ఈ పసుపుపచ్చ కప్పలు సందడి చేస్తూ.. కనువిందు చేశాయి. పెద్ద సంఖ్యలో ఈ పసుపుపచ్చని కప్పలు బెకబెకలాడుతూ కప్పగంతులు వేయడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పసుపుపచ్చని కప్పలు కనిపించడం శుభసూచకమని జనం అంటున్నారు.