రీపోలింగే కాదు.. కౌంటింగూ బహిష్కరణే.. పాపం వైసీపీ
posted on Aug 14, 2025 9:46AM
.webp)
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైంది. గురువారం (ఆగస్టు 14) ఉదయం ఎనిమిది గంటలకు కడపలోని మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి , జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి, వెంకటపతి, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చిన్నయ్య లు పర్యవేక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పులివెందులకు సంబంధించి 10 టేబుళ్లలో ఒక రౌండ్, ఒంటిమిట్టకు సంబంధించి పది టేబుళ్లలో మూడు రౌండ్లు ప్రకారం ఓట్ల లెక్కింపు చేపట్టారు . ఒక్కో టేబుల్ కు ఒక్కో సూపర్వైజర్ ,ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు.మొత్తం వంద మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా ఇందులో 30 మంది,సూపర్వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు స్టాటస్టికల్ అధికారులు ఉన్నారు
ఇలా ఉండగా వైసీపీ ఈ కౌంటింగ్ ను బహిష్కరించింది. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ను బహిష్కరించినట్లు పార్టీ నేతలు చెప్పారు. కాగా పులివెందుల జడ్పీటీసీ లోని రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం ( ఆగస్టు 13) జరిగిన రీపోలింగ్ ను కూడా వైసీపీ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బహిష్కరణలపై తెలుగుదేశం వైసీపీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నది. ఓటమిని ముందే అంగీకరించేసి తప్పుకుంది పాపం అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.