ముఖ్యమంత్రి రేవంత్ కు కోపమొచ్చింది.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా?  గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా?  అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా?  అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది. 

ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి.. మంగళవారం(మే28)  జిల్లా కల్లెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. అఫ్కోర్స్  రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలతో పాటుగా.. ఇంచార్జి మంత్రుల జిల్లా పర్యటనలు, జూన్ 3వ తీదీ నుంచి 20వ వరకు జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, ధాన్యం సేకరణ, తదితర అంశాలపై చర్చించేందుకే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉండవచ్చును. అయితే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన చేసిన వ్యాఖ్యలు  కొంత భిన్నంగా ఉన్నాయని అంటున్నారు.

ఈసందర్భంగా జిల్లా కల్లెక్టర్లు కార్యాలయాలకు పరిమితం అయితే కుదరదని ముఖ్యమంత్రి కరాఖండిగా  చెప్పారు. మంత్రులు జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర  స్థాయిలో పర్యటించి, ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఖరీఫ్ సీజన్  వ్యసాయ కర్యకాలపాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.  జిల్లాల ఇంచార్జి మంత్రులు మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించి ధాన్యం సేకరణ, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు,ఖ రీఫ్ సీజన్ వ్యవసాయ కర్యకాలపాల అమలు తీరును సమీక్షించి..  నివేదికను జూన్ 1 వ తేదీ, సాయంత్రం 4 గంటల లోపు  సీఎంవోకు అందచేయాలని ఆదేశించారు.  

అంతే అయితే, అదో రకం కానీ..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతటితో ఆగలేదు. జిల్లా కల్లెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా కల్లెక్టర్లు  క్షేత్ర స్థాయి  పర్యటనలు చేసి తీరాలని లేదంటే, ప్రత్యామ్నాయం చూసుకోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. అంతే కాదు.. ఇక పై ప్రమోషన్లు, పోస్టింగులకు  క్షేత్ర స్థాయి పని తీరు ప్రధాన కొలమానంగా ఉంటుందని స్పష్టం చేశారు.  
అంతే కాదు.. జిల్లా కల్లెక్టర్లు ఎవరికైనా క్షేత్ర స్థాయి పర్యటనలకు ఏ కారణంగా అయినా.. ఎలాంటి ఇబ్బంది,అభ్యంతరం ఉన్నా,  వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూసుకుంటామని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  మాట వినక పోతే సహించేది లేదని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు.

అలాగే..  ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీడియా, సోషల్ మీడియా చేస్తున్నతప్పుడు ప్రచారం విషయంలో కల్లెక్టర్లు మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన  ముఖ్యమంత్రి,  కల్లెక్టర్లు వాస్తవాలను చెప్పకపోవడం వలన తప్పుడు ప్రచారాన్ని  ప్రజలు నిజమని నమ్మే పరిస్థితి వస్తోందని అన్నారు. అధికారులు, ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో క్రియాశీలంగా ఉండాలని, వాస్తవ సమాచారం ఇచ్చిన తర్వాత కూడా తప్పుడు ప్రచారం కొనసాగితే.. అందుకు బాధ్యులైన వారిపై పోలీసు కేసులు పెట్టాలని మఖ్యమంత్రి   ఆదేశించారు.  ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోక పోవడం వలన, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, జిల్లా కల్లెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనల వలన వాస్తవ విషయాలు బయటకు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి, కల్లెక్టర్లు సహా అధికారుల పనితీరు పట్ల సంతృప్తిగా లేరనే విషయం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైందని అంటున్నారు.

అదలా ఉంటే ముఖ్యమంత్రి అసంతృప్తికి, ఆయన మూడు రోజులఢిల్లీ పర్యటనకు  ఏదైనా సంబంధం ఉందా..  కొన్ని పత్రికల్లో వచ్చినట్లు ప్రభుత్వ పనితీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్త చేసిననేపథ్యంలోనే ముఖ్యమంత్రి  అత్త మీది కోపాన్ని దుత్త మీద చూపినట్లు అన్న చందాన అధికారుల మీద చూపించారా  అనే  కొత్త చర్చ మొదలైంది. అలాగే.. ముఖ్యమంత్రి, మంత్రులకు మధ్య  సయోధ్య సరిగా లేదని వస్తున్న కధనాలకు సమాధానంగానే..  ముఖ్యమంత్రి తమ నివాసంలో విందు ఇచ్చారా ? అనే ప్రశ్న కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.