ప్రొటెం స్పీకర్ ఎవరు?

తెలంగాణలో తొలి సారి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా పాలన ప్రారంభించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని శనివారం నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య బీమాకూడా తక్షణమే అమలుకు నిర్ణయం తీసేసుకున్నారు. వరుస సమీక్షలకు కూడా రెడీ అయిపోయారు. ఇక శనివారమే అసెంబ్లీ సమావేశంలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర మూడో అసెంబ్లీ తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్ ఎవరన్ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ స్పీకర్ ను ఎన్నుకునేంత వరకూ ప్రొటెం స్పీకరే స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారు. అటువంటి కీలకమైన ప్రొటెం స్పీకర్ ఎవరు అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఈ ఆసక్తి ఎందుకంటే సాధారణంగా అసెంబ్లీకి ఎక్కువ సార్లు ఎన్నికైన సీనియర్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు. కొత్త అసెంబ్లీలో అందరి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే. అయితే కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకూ కొత్త ముఖ్యమంత్రిని అభినందించి శుభాకాంక్షలు చెప్పింది లేదు. కనీసం హుందాగా ఓటమిని అంగీకరిస్తూ ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. ఇహ ఇప్పుడు ఆయన హాజరుపై ఎటువంటి అనుమానాలూ లేవు. ఎందుకంటే ఆయన గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కనుక ఆయన అసెంబ్లీ తొలి సమావేశాలకు హాజరయ్యే ప్రశ్నే లేదని తేలిపోయింది. ఇక మిగిలిన వారిలో సీనియర్లు అంటే అధికార కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వారిరువురూ కూడా రేవంత్ కేబినెట్ లో మంత్రులు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ ఉన్నారు. వీరు కాకుండా ఎంఐఎం నుంచి అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు.

దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వారు ప్రొటెం స్పీకర్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపిక విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం లేదని బీఆర్ఎస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది. అన్నిటికీ మించి బీఆర్ఎస్ నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వలసలు ఉంటాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. దీంతో ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరంచే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.