గుడులను దోచేసిన మంత్రి!
posted on Feb 23, 2021 2:06PM
బెజవాడ దుర్గ గుడిలో పని చేస్తున్న 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏపీ దేవాదాయశాఖ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఏసీబీ నివేదిక ఆధారంగా గుడి నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా స్పందించారు. దుర్గగుడిలో చిరు ఉద్యోగులను సస్పెండ్ చేయటం సరికాదన్నారు. దుర్గుగుడిలో జరిగిన అవకతవకలు అవినీతికి ప్రధాన కారకులు మంత్రి వెల్లంపల్లి, ఈఓ సురేష్ బుబు అని ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.
దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతూనే ఉందని ఎంపీ కేశినేని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి గుడులు, దేవాలయాలను దోచుకుంటున్నారని...మూడు రోజులు జరిగిన ఏసీబీ దాడుల్లో అది రుజువైందని అన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తాను నిధులు తెప్పించుకుని విజయవాడను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలపై పన్నులు వేయటానికే తప్ప అభివృద్ధి మాత్రం వైసీపీ పట్టించుకోవటం లేదని కేశినేని నాని విమర్శించారు.