అది ప్రజల నినాదం.. బీజేపీ నినాదం కాదు..

 

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నా గొంతు మీద కత్తి పెట్టినా సరే నేను భారత్ మాతాకీ జై అనను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. అసద్దుద్దీన్ కు కౌంటర్ గా చాలా మంది చాలా విమర్శలే చేశారు. రచయిత జావేద్ అక్తర్, ఆయన సతీమణి షబానా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ ఇంకా చాలామంది చాలా రకాలుగా స్పందించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పందించి దీనిని రచ్చ చేయవద్దు అని హితవు పలికారు. అసలు ఈవివాదాన్ని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు అర్ధం కావట్లేదు.. 'భారత్ మాతాకీ జై' అంటే దేశానికి సెల్యూట్‌ చేయడమే.. ఆ నినాదాం బీజేపీ సొంతం కాదని, అది ప్రజల నినాదమన్నారు. భారత్ మాతాకీ జై నినాదంపై రచ్చ చేయడం మంచిది కాదని, ఎవరైనా స్లోగన్‌ ఇవ్వవచ్చునన్నారు. పాకిస్తాన్‌ మీద టీంఇండియా గెలిచిన తర్వాత స్టేడియంలో ఉన్నవాళ్లందరూ భారత్ మాతా కీ జై అని అన్నారని, అలా అనమని వాళ్లకు ఎవరూ చెప్పలేదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆ నినాదం చేశారని, ఎవరైనా భారత్ మాతా కీ జై అనవచ్చునని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.