బాబు మాకు బిగ్ బ్రదర్.. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్
posted on Oct 1, 2025 9:56AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజన్ తమకు ఆదర్శమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ అన్నారు. దేశంలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ఆయనే ఆద్యుడని ప్రశంసించారు. ఢిల్లీలో మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సదస్సులో గోయల్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు అందించిన సేవలు అమోఘమన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ఇది ఏడో సారి అన్న పీయూష్ గోయెల్ ఈ సారి సీఐఐ సదస్సుకు వేదిక విశాఖపట్నం కావడం ముదావహమన్నారు.
పరిశ్రమలు స్థాపనకు, పెట్టుబడులకు విశాఖ అత్యంత అనువైన ప్రదేశమని చెప్పారు. దేశవ్యాప్తంగా అమలు చేసిన జీఎస్టీ వంటి కీలక ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడం వెనుక చంద్రబాబు విజన్, ప్రోత్సాహం, సహకారం ఉందన్న ఆయన సీబీఎన్ మార్గనిర్దేశంతోనే ఇటువంటి క్లిష్టమైన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయగలిగామన్నారు. విశాఖలో జరగబోయే సీఐఐ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.