జగన్ అలా మాట్లాడటం నాకు నచ్చలేదు: ఉండవల్లి

 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్ ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 30 న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ కి ఉండవల్లి అరుణ్ కుమార్ అభినందనలు తెలిపారు. తాజాగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పువచ్చిందన్నారు. 50శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి అన్నారు. జగన్ పాలనలో అందుకు తగ్గట్టుగా మార్పులు రావాలని ఆయన ఆకాక్షించారు.

ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్సార్ గుర్తుకొచ్చారన్నారు. అవినీతిని రూపు మాపేందుకు ఉద్యోగుల జీతభత్యాల వివరాలు వెల్లడించాలన్నారు. జ్యుడీషియల్ కమిటీ సిఫార్స్ మేరకు బిల్లులు చెల్లించడం విప్లవాత్మకమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆశించినట్టు పోర్ట్ కి అవకాశం ఇవ్వాలని జగన్‌కు సూచించారు. వాన్ పిక్ ప్రాంతంలో సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.

మద్య నిషేధానికి ముందు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మోదీకి మెజార్టీ ఉంది కాబట్టి ఏమి చేయలేమనడం సరికాదన్నారు. గతంలో చంద్రబాబు మాదిరే జగన్ ఈ విషయంలో మాట్లాడడం తనకు నచ్చలేదన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన వాటికోసం ప్రయత్నించాలని జగన్‌కు ఉండవల్లి సూచించారు.

చంద్రబాబు పాలనలో పనుల కన్నా ప్రచారం ఎక్కువ జరిగిందన్నారు. పట్టిసీమ నీళ్లిచ్చిన చోట గన్నవరం మినహా అన్ని సీట్లలో టీడీపీ ఓడిపోయిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా పోషించాలన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా 26 సీట్ల నుంచే ఎదిగిందని ఉండవల్లి గుర్తు చేశారు. టీడీపీ 2004లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు.