శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయం ప్రారంభం.. భారీగా వచ్చిన భక్తులు

లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలు విక్రయాలు ఇన్నిరోజులకు మళ్లీ మొదలయ్యాయి. దీంతో, లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలివచ్చారు.

కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ, స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ త్వరలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.