కాలినడకన తిరుమలకు అనిల్ కుమార్ సింఘాల్
posted on Sep 10, 2025 11:41AM

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఆయన బుధవారం (సెప్టెంబర్ 10)న టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి.. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకూ టీటీడీ ఈవోగా పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి వ్యక్తి అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అలిపిరి మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఆయన భక్తులతో మాటామంతి కలిపి వారి నుంచి తిరుమలలో సౌకర్యాల కల్పనపై సలహాలు, సూచనలూ స్వీకరించారు.
తాను 1984లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని గుర్తు చేసుకున్న ఆయన అప్పట్లో శ్రీవారి దర్శనానికి తనకు ఏడుగంటలకు పైగా సమయం పట్టిందన్న ఆయన సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు తిరుమలలో సామాన్య భక్తుల బాధలు తెలిశాయని చెప్పారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు విధుల్లో భాగంగా తరచూ తిరుమల దర్శనానికి వచ్చేవాడినని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తానని సింఘాల్ అన్నారు.