తిరుమలలో అన్నప్రసాదం స్వీకరించిన వెంకయ్య నాయుడు
posted on Jul 27, 2025 5:50PM

తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు తో కలిసి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో ముచ్చటించారు. అన్నప్రసాదాలు రుచికరంగా, శుభ్రంగా ఉన్నాయని భక్తులు ఆయన వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదం ఎంతో శుచిగా, రుచిగా ఉందని తెలిపారు. శ్రీవారి సేవకులుగా భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించడం ఆనందదాయకమైన విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు కూరగాయలు, ఇతర వస్తువులను డొనేషన్ ఇవ్వడం ఆనందదాయకమని మాజీ భారత ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.