ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి బెదరింపు లేఖ
posted on Aug 21, 2025 12:17PM

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ఈ నెల 17న నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వచ్చి అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆ లేఖలో రెండు కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ప్రశాంతి రెడ్డిని చంపేస్తామంటూ బెదరింపు ఉంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బదరింపు లేఖ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టారు.
ఈ బెదరింపు లేఖకు సంబంధించి అల్లూరు మండలం ఇస్కపాళెంకు చెందిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఎంపీ నివాసంవద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు ఉండటం, అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిస్తుండటంతో అతడిని కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బెదరింపు లేఖ రావడం వాస్తవమేనని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు.