ఏపీపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్

జాన్ జిగ్రీలైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ల మధ్య తాజాగా పోతిరెడ్డిపాడు వ్యవహారం చిచ్చు పెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ భేటీని మళ్ళీ ఈ నెల ఇరవయ్యో తేదీ తర్వాతే సమావేశం ఏర్పాటు చేయాలనీ తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఐతే రెండు రాష్ట్రాల సీఎంలు హాజరైతేనే అపెక్స్ భేటీ జరుగుతుంది. ఐతే ఈ భేటీ పై కేసీఆర్ ఆసక్తి చూపకపోవడంతొ అది కాస్తా వాయిదా పడింది. అయితే మరో పక్క కేసీఆర్‌కు తెలంగాణ కోసం కృష్ణా జలాలను కాపాడే ఆసక్తి లేదని అందుకే.. అపెక్స్ భేటీకి హాజరవకుండా రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా దీనికి కౌంటర్‌గా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం.. కట్టాలనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని ఆ పిటిషన్ లో తెలంగాణ సర్కార్ కోరింది

ఐతే ఇప్పటికే ఈ టెండర్లను నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కృష్ణాబోర్డు ఆదేశాలను ఏపీ పట్టించుకోవడం లేదు. దీనికి కారణం శ్రీశైలం నుంచి నీటిని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ తరలిస్తుంటే దానిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము మాత్రం టెండర్లను ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందనేది త్వరలో తెలియనుంది. ఇది ఇలా ఉండగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పందొమ్మిదో తేదీన ఏపీ ప్రభుత్వం టెండర్లను ఖరారు చేయనుంది. ఐతే టెండర్లను ఖరారు చేసినా కూడా నిర్మాణాలు మాత్రం ప్రారంభించవద్దని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎంతో సఖ్యంగా ఉంటున్న ఇద్దరు సీఎం ల మధ్య ఈ వ్యవహారం చిచ్చు పెడుతుందా లేక సమసి పోతుందా వేచి చూడాలి.