మళ్ళీ మొదటికొచ్చిన భేతాళ ప్రశ్న.. బీజేపీ అధ్యక్షుడు ఎవరు ?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  ఇంకా  రెండేళ్ళు అయినా అవకుండానే అట్టర్ ప్లాప్  సినిమా చూపిస్తోంది.  ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  మూడు ముక్కల ఆటలో మునిగి తేలుతోంది. మరో వంక కాళేశ్వరం మొదలు కారు రేసు వరకు అనేక అవినీతి ఆరోపణలు, విచారణలు బీఆర్ఎస్ ను  వెంటాడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్  చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండీ లేనట్టుగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్,కాదంటే బీఆర్ఎస్ పంచన చేరడం మినహా లెఫ్ట్ పార్టీలకు మరో దారి కనిపించడం లేదు. ఒక విధంగా చూస్తే.. ఇప్పటికిప్పుడు అలాంటి పరిస్థితి లేక పోయినా, రాష్ట్ర రాజకీయాల్లో మెల్లమెల్లగా  రాజకీయ శూన్యత ఏర్పడే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. 

ఈ పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభావం చూపగల పార్టీ ఏదైనా ఉందంటే..  అది బీజేపీ ఒక్కటే.  కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా..  కమల దళానికి అన్నీ ఉన్నాయి కానీ, సమర్ధ నాయకత్వమే కరవైంది. అలాగని నాయకులు లేరా అంటే ఉన్నారు. బీజేపీలో పుట్టి బీజేపీలో ఎదిగిన నాయకులు ఉన్నారు. కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఇతర పార్టీలలో ఎదిగొచ్చిన సీనియర్ నాయకులూ ఉన్నారు. అయితే.. నాయకుల మధ్య ఐక్యత లేదు. 

నిజానికి.. ఐక్యత లేక పోవడం వల్లనే 2023లో చేతిదాక వచ్చిన ముద్ద నోటికి చేరకుండానే జారి పోయింది. ఈ మాట అన్నది మీరో నేనో, ఇంకెవరో కాదు.. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ. అవును..  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు  తనను కలిసిన సందర్భంలో స్వయంగా మోదీనే చేతికి అందివచ్చిన అవకాశాన్ని రాష్ట నాయకులు  చేజార్చుకున్నారని అన్నారని  అప్పట్లో వార్తలొచ్చాయి. 

నిజానికి.. బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య విబేధాలు,  అంతర్గత కుమ్ములాటల కారణంగానే, పార్టీ 2023 ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేక పోయిందని  అందరూ అంగీకరిస్తున్న విషయమే. ఆ కారణంగానే పార్టీ అధిష్టానం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుని మార్చింది.  బండి సంజయ్ ని తప్పించి, కిషన్ రెడ్డి చేతికి  పార్టీ పగ్గాలు అప్పగించింది. బండి సంజయ్ నాయకత్వంలో తక్కువలో తక్కువ  కనీసం 25నుంచి 30 సీట్లు అవలీలగా గెలుస్తుందన్న ధీమాతో ఉన్న సమయంలో ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి తప్పు చేసిందని  పార్టీలో ఇప్పటికీ ఆవేదన వ్యక్తమవుతోంది. 

ఆత్మహత్యా సదృశ్యమైన నిర్ణయం ఎందుకు, ఎవరి ప్రోద్భలంతో  తీసుకుందో ఏమో కానీ.. అది పార్టీ చరిత్రలో ఒక  చారిత్రక తప్పిదంగా మిగిలిపోయిందని పార్టీ పట్ల నిబద్దత గల సీనియర్ కార్యకర్తలు ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు.  అలాగని కిషన్ రెడ్డి  అసమర్ధుడని కాదు. పార్టీ పట్ల ఆయనకు  విధేయత లేదనీ కాదు.   అయితే.. బండి సంజయ్ ను తప్పించడంతో   కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.  మరో వంక కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి బీఆర్ఎస్ కు అక్రమ సంబంధాన్నిఅంటగట్టింది. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ నాయకత్వం బండిని తప్పించారని, ప్రచారం సాగించింది.  బీజేపీకి వేసే ఓటు బీఆర్ఎస్ ఖాతాలోకి చేరుతుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి విమర్శలను జనం విశ్వసించారు.  కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఫలితంగా, బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత బీజేపీనీ తాకింది. దీంతో 2019 లోక్ సభ, జీహెచ్ఎంసి ఎన్నికలు, దుబ్బాక, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ..  వెనక్కిపోయి, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ముందు కొచ్చింది. అదే ఊపులో అధికారాన్నీ  హస్తగతం  చేసుకుంది. బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లకే పరిమితం అయింది. అయితే.. ఆ తర్వాత ఆరేడు నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ పుంజుకుంది. కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది.   

సరే..  అదంతా చరిత్ర. గతం గతః అనుకున్నా..  ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం కళ్ళు తెరిచిందా అంటే అదీ లేదు. కాషాయ పార్టీలో ఇప్పటికీ కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక  సంవత్సరకాలంగా  ఒక ప్రహసనంలాగా సాగుతోంది.  ఎప్పటికప్పుడు కొత్త లెక్కలు, కొత్తకొత్త ఫార్ములాలు తెరపైకొస్తున్నాయి. కొంత కాలం పాత, కొత్త లెక్కలు..  ఆ తర్వాత బీసీ-ఓసీ ఈక్వేషన్లు.. ఇలా అనేక కోణాల్లో ఆలోచనలు అయితే సాగుతున్నాయి కానీ.  నిర్ణయం మాత్రం జరగలేదు. 

మరో వంక మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఇంచుమించుగా ఖరారు అయినట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతో ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఖారైనట్లు పార్టీలో ప్రచారం జరిగింది. నిజానికి స్వయంగా ఈటల కూడా అదే విశ్వాసంతో ఉన్నారు. అయితే..  వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లు  ఈటల పేరు ఖరారై, ఇక రేపోమాపో ప్రకటన వెలువడుతుందని అనుకుంటున్న సమయంలో  పహల్గాం ఉగ్రదాడితో , ప్రకటన వాయిదా  పడింది. ఇప్పడు మళ్ళీ అంతా ఒకే అనుకుంటున్న సమయంలో  కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా.. టీఆర్ఎస్’ తొలి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన,ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది.  వచ్చే నెల (జూన్) 9 న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. దీంతో మరో  ‘సారీ’ ప్రకటన వాయిదా పడవచ్చని అంటున్నారు. మరోవంక.. ఇదే సమయంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన రావు, డీకే అరుణ కూడా పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  కానీ, ప్రధాన పోటీ మాత్రం ఇప్పటికీ..  ఈటల వర్సెస్ బండి గానే సాగుతోందని అంటున్నారు. అయితే చివరకు ఏమి జరుగుతుంది? బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుంది? అంటే, అదో సమాధానం లేని భేతాళ ప్రశ్న..అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu