కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన లాలూ ప్రసాద్
posted on May 25, 2025 4:40PM

రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి కూడా అతడిని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు విరుద్ధంగా నడుచుకుంటున్నందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నందుకు తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి, కటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని లాలూ యాదవ్ ట్వీట్టర్ వేదికగా ద్వారా పేర్కొన్నారు.
తాను 12 ఏళ్లుగా అనుష్క యాదవ్ అనే మహిళతో రిలేషన్లో ఉన్నట్లు తెలుపుతూ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ఫేస్బుక్ ఖాతాలో శనివారం చేసిన పోస్టు వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజే లాలూ యాదవ్ అతడిపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తన ఫేస్బుక్ పోస్టుపై ఆదివారం ఉదయమే తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. ఆ పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టుతో జత చేసిన ఫొటో కూడా ఒరిజినల్ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఎడిట్ చేశారని ఆరోపించారు. తమ ఫ్యామిలీ పరువు తీయడానికే ఎవరో ఇలా చేశారని విమర్శించారు. అయినా ఆ పోస్టును కారణంగా అతడి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్.. తేజ్ ప్రతాప్పై పార్టీ నుండి సస్పెండ్ చేశారు.