కర్నూలు పౌరుషం చూపిస్తాం
posted on Aug 31, 2013 11:55AM
హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్ర ఉద్యోగుల జోలికి వస్తే కర్నూలు పౌరుషం చూయించాల్సి వస్తుంది. హైదరాబాద్ లో నివసించే హక్కు అందరికీ ఉంటుంది. ఏపీఎన్జీఓలు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ నాయకులకు అభ్యంతరం ఎందుకు ? ఏపీ ఎన్జీఓల సభను అడ్డుకుంటే ఉద్యమం కర్నూలు నుండి మొదలవుతుంది. అడ్డుకున్న వారికి కర్నూలు పౌరుషం రుచిచూపిస్తాం అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి అన్నారు.
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం కర్నూలు నిర్వహించారు. సమావేశానికి అనంతపురం, కర్నూలు నేతలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా కేఈ మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కయి రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటకాలు ఆడుతున్నాయని, ప్రజలంతా ఈ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.