10 వేల మందితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు!
posted on May 12, 2020 11:27AM
ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును తెలుగు తమ్ముళ్లు పండుగలా జరుపుకుంటారు. అయితే ఈసారి మహానాడు వినూత్నంగా జరుగబోతోంది! భారీ బహిరంగసభ గాకుండా.. వర్చువల్ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
లాక్డౌన్ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు జరుగనుంది. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పదుల సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది.
ఒకేసారి 10వేల మందితో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల దృష్ట్యా కిందటిసారి మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు. లాక్డౌన్ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోగా... కరోనా నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయా లపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్ కాన్పరెన్స్కు అనుగుణంగా ఏర్పాట్లుచేయాలని వారికి సూచించారు.