ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ జయకేతనం
posted on Mar 23, 2023 8:15PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాథ జయకేతనం ఎగురవేశారు. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరగగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలలో వంద శాతం ఓటింగ్ జరిగింది. అంటే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా అన్నీ ఓట్లూ చెల్లుబాటు అయ్యాయి.
ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ 22 ఓట్లు అవసరం. ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు 23 ఓట్లు వచ్చాయి. వాస్తవంగా టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఆమెకు 23 ఓట్లు రావడం గమనార్హం.
వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీకే ఓటు వేశారని భావించినా, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారని పంచుమర్తి అనూరాథ విజయం ద్వారా తేలిపోయింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించగా, వైసీపీ తరపున బొమ్మి ఇజ్రాయెల్, ఏసురత్నం, పోతుల సునీత, సూర్యనారాయణరాజు, మర్రి రాజశేఖర్ గెలుపొందారు. వైసీపీ ఇతర అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులుకు 21 ఓట్లు చొప్పున రావడంతో... రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో వెంకటరమణ విజయం సాధించారు.