అందుకే టీడీపీ ఎంపీలను బాబు బీజేపీలోకి పంపారు!!

 

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే వారిని టీడీపీ అధినేత చంద్రబాబే పంపించారంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

బాబు తనపై ఉన్న అవినీతి కేసులకు భయపడే తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారని తలసాని ఆరోపించారు. నలుగురు ఎంపీలు బాబుకు అత్యంత ఆప్తులని.. బాబుకు సంబంధించిన అన్ని వ్యక్తిగత, వ్యాపార, రాజకీయ విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన వుందన్నారు.

చంద్రబాబు హయాంలో ఏపీలో అవినీతి రాజ్యమేలిందని, టీడీపీ నేతలు దేనిని వదలకుండా దోపిడీ చేశారని తలసాని ధ్వజమెత్తారు. ఇప్పుడు అధికారం కోల్పోవడం.. కొత్త ప్రభుత్వం బాబు పాలనపై ఎంక్వైరీ కమిటీ వేయడంతో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని తన మిత్రులకు కాషాయ కండువా కప్పించారని తలసాని ఆరోపించారు.

ఇక తెలంగాణలో కాలం చెల్లిన నేతలకు బీజేపీ కండువా కప్పుతోందని తలసాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 25 ఏళ్ల నుంచి తెలుగునాట ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఇంకా తెలియడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ నేతలకు నిరీక్షణ తప్పించి నో యూజ్ అని తలసాని వ్యాఖ్యానించారు.