పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై నాగం పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు!
posted on May 21, 2025 11:04PM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టంగా పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. దాదాపు ఐదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ పిటిషన్ ను జస్టిస్ బీవీనాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం డిస్మిస్ చేసింది.
మేఘా ఇంజినీరింగ్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ ఇప్పటికే తెలంగాణ హైకోర్టు దీనికి సంబంధించి ఐదు పిటిషన్లు కొట్టివేసిందనీ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదనీ, ఈ మేరకు సీవీసీ కూడా నివేదిక ఇచ్చిందనీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా బీహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి సంస్థ కూడా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం నాగం పిటిషన్ ను కొట్టివేసింది.