మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

 

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావుకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ షోకాజ్ నోటీసులు పంపించారు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌పై సునీతా రావు సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబ నోటీసులు జారీ చేశారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల సునీతారావు ఆధ్వర్యంలో మహిళా నేతలు గాంధీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం మహిళా కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమించిందని.. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల విషయంలో మహిళా కాంగ్రెస్‌కు అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎన్నిసార్లు కలిసినా సీఎం రేవంత్‌రెడ్డిని కలవండి అని చెబుతున్నారని సునీతా రావు వాపోయింది. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని ఆమె అన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు సునీతా రావు ప్రశ్నించింది. బీఆర్ఎస్,  బీజేపీ నుండి వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారని ఆమె తెలిపింది