వేతన వెతలు.. రివర్స్ పీఆర్సీ.. జగనన్న వృద్ధులనూ వదల్లేదుగా..!

ఎవరికన్నాఆసక్తి ఉంటే ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ప్రసంగ వీడియోలను చూడండి... ఈ ప్రసంగాలలో జగన్మోహన్ రెడ్డి, చేతులు, చూపులు విభిన్న భంగిమల్లో తిప్పుతూ, బహుముఖ విన్యాసాలు చేస్తూ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ అంటూ మొదలు పెట్టి ప్రతి తాతకు, ప్రతి అవ్వకు అందరికీ అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు అందరితో పాటు అవ్వలు,తాతలను కూడా వదలలేదు. అందరితో పాటు   పింఛనుదార్లను కూడా వదల కుండా వారికీ పీఅర్సీ వాతలు పెట్టారు. అందుకే,  వృద్దల గొంతులు కోశారు, అనే ఆవేదన పింఛనుదార్లు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, జగన్ రెడ్డి దేవుని పేరిట ఆడిన అబద్ధాలను నమ్మి, ఓటేసిన పాపానికి, ‘దేవుడు’ తమకు తగిన శిక్షే వేశారని, తాతలు, అవ్వలు వాపోతున్నారు. 

వివరాలలోకి వెళితే, రాష్ట్ర ప్రభుత్వం అర్థ రాత్రి విడుదల చేసిన కొత్త వేతన సవరణ ఉత్తర్వులతో  ఉద్యోగుల నడ్డి విరిచింది. అలాగే,  ఉద్యోగులతో పాటుగా పింఛనుదారులను దారుణంగా దెబ్బ తీసింది. వృద్ధాప్యంతో నానా అవస్థలు పడుతున్న పింఛనుదారుల పించనుకూ కోతలు విధించింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధ పింఛనుదార్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ మొత్తంలో జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు విధించింది. 

అదే విధంగా వయసుతో పని లేకుండా, ఐఆర్‌ కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించడంతో పింఛనుదారులు తమకు వాస్తవంగా రావలసిన మొత్తం కంటే, ఇప్పటికే అధికంగా తీసుకున్నారని, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్ముందు ఇచ్చే కరవు భత్యం (డీఆర్) నుంచి ఈ మొత్తాన్ని మినహాయించుకుంటామని తెలిపింది.ఇలా వడ్డించిన విస్తరిలోంచి నోటి కాడి కూడును ఎగరేసుకు పోవడం ఏమిటని, వృద్ధ పించారుదారులు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.ఈ పాపం ఉరికే పోదని శపిస్తున్నారు.

ఇతవరకు ఎప్పుడూ కూడా ఇలా, ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్న సందర్భం లేదని అంటున్నారు. ఇలా, ఇచ్చిది తీసుకునే కొత్త విధానం  కారణంగా కొందరు పింఛనుదారులు లక్ష రూపాయల  వరకు కూడా  నష్టపోతున్నారని, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. అంటే వీరెవరికీ భవిష్యత్తులో డీఆర్‌ రూపంలో కొత్తగా ప్రయోజనం దక్కే అవకాశం లేదని విశదమవుతోందని విశ్లేషకులు, పింఛనుదార్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

ఇవ్వన్నీ ఒకెత్తు అయితే, శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే సామెతను గుర్తు చేసే విధంగా, పింఛనుదారు మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే అంత్యక్రియల ఖర్చులకు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కోతలు పెట్టింది. ఇంతవరకు పింఛనుదారులు చనిపోతే, అత్యక్రియల ఖర్చుల కోసంగా ప్రభుత్వం,కనీస మొత్తం రూ.15 వేలకు తగ్గకుండా  ఒక నెల పింఛను ఇస్తోంది. అయితే ఇప్పుడు, నెల పింఛను ఎంతున్నా, కనిష్టంగా రూ 15లు గరిష్ఠంగా రూ.20 వేలు మించకూడదని కొత్త  ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే నెల పింఛను రూ. 20, రూ.50 వేలు అంతకు ఎక్కువ ఉన్నా, అంత్యక్రియలకు ఇచ్చేది మాత్రం ఆ రూ. 20 వేలు మాత్రమే. జగన్ రెడ్డి  ప్రభుత్వం ఇంతలా ఎందుకు కక్కుర్తి పడుతోంది ..ఎందుకు  తాతలు, అవ్వలను సైతం క్షోభకు గురి చేస్తోంది? అంటే వినాశకాలే విపరీత బుద్ధి .. అనే సమాధానమే వస్తోంది.