మహా సంక్షోభంలో థ్రిల్లింగ్ క్లైమాక్స్.. సీఎం షిండే.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్!
posted on Jun 30, 2022 10:54PM
మహారాష్ట్ర రాజకీయాల్లో సినిమాలకు మించి ట్విస్ట్లు జరుగుతున్నాయి. తాజాగా మరో కొత్త ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. మహా రాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్గా గెలిచారు.
మాస్ లీడర్గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి షిండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏక్నాథ్ షిండేతో పాటు 15మంది రెబెల్ ఎమ్మెల్యేలకు గతవారం డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అన ర్హత నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎం వి ఎ) ప్రభుత్వం తరఫు న్యాయవాది దేవ దత్ కామత్ కోర్టులో వాదనలు వినిపించారు. అపరిష్కృతంగా వున్న సమస్యలు పరిష్కరించేవరకూ ఎలాంటి బలపరీక్షలు వుండవని అన్నారు. కానీ అలాంటి ఆదేశా లు జారీచేయడంవల్ల అనవసర సందిగ్ధత చోటుచేసుకుంటుందని సుప్రీం కోర్టు పేర్కొ న్నది. ఏదైనా చట్ట విరుద్ధంగా జరిగితే, మీరు ఎప్పుడైనా ఈ కోర్టును సంప్రదించవచ్చు" అని పేర్కొన్నది. అయితే ఇరువర్గాలు సుదీర్ఘ పోరాటానికే సిద్ధపడ్డాయి. కనుక ఈ వారంలో సభలో బలాన్ని నిరూపించుకో వాలని ప్రభుత్వాన్ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కోరారు. అందుకు షిండే అందుకు సిద్ధపడ్డారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్కు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించిన రెబెల్స్ నేత షిండే తమకు సుమారు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వుందని, అందులో సుమారు 40 మంది శివసేనవారే వున్నారన్నారు. కాగా, షిండే వర్గంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని బిజెపీ నాయకులు చాలామంది ముంబైలో దేవేం దర్ ఫడ్నవీస్ నివాసంలో చర్చించారని సమాచారం. షిండే తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పార్టీ నాయకుడు సుధీర్ ముంగంతివా అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించగానే ఎన్సిపి సీనియర్ నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశమయ్యారు. అయితే సభలో బలపరీక్షకు ముందే ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేసేశారు.
మరో వైపు శివసేన రెబల్స్ మద్దతుతో బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. అయితే చివరి క్షణంలో బీజేపీ వ్యూహం మార్చుకుని షిండే నాయకత్వంలోని రెబల్స కు మద్దతుగా నిలిచింది. తొలుత శివసేన రెబల్స్ నేతృత్వంలోని ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ తరువాత కొద్ది సేపటికే మనసు మార్చుకుని ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు బీజేపీ అధిష్ఠానం ఆయనను ఒప్పించినట్లు చెబుతున్నారు.