ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం మళ్ళీ వాయిదా
posted on Sep 29, 2020 3:29PM
అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన ఏపీ ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించింది.
అక్టోబర్ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నవంబర్ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
అయితే, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు.
అక్టోబర్ 5న పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్లను ప్రభుత్వం అందజేయనుందని మంత్రి సురేష్ తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుందని, వీలుంటే సీఎం వైఎస్ జగన్ ఏదైనా స్కూల్కు కూడా వెళ్తారని మంత్రి పేర్కొన్నారు.