ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకేనా?

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. సుంకాలపై ముందునుంచీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన ట్రంప్‌.. ఇప్పుడు ఉన్నట్టుండి వాటిని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం బాండ్‌ మార్కెటే అంటున్నారు విశ్లేషకులు.
 ఏప్రిల్‌ 2న భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్‌ . దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ భారీ ఒడుదొడుకులను చవిచూశాయి. అయితే, ఈ టారిఫ్‌ల కారణంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొనడంతో పాటు అంతర్జాతీయ మాంద్యం రావొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని తోటి రిపబ్లికన్‌ నేతలు, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్ లు పదేపదే హెచ్చరించారు కూడా.
అయినా అధ్యక్షుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.ఈ విషయంలో తన నిర్ణయం ఎప్పటికీ మారదు అని గట్టిగా చెప్పారు. ఆయనకు సర్ది చెప్పేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే, చివరి నిమిషంలో అనూహ్యంగా సుంకాలపై విరామం ప్రకటించడం గమనార్హం.

 ట్రంప్‌ నిర్ణయం వెనక బాండ్‌ మార్కెట్‌ ఒక్కటే కారణమని తెలుస్తోంది. ఈ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలతో యూఎస్‌ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో మొదలైన ఆందోళనల వల్లే అధ్యక్షుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ ఆందోళనలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అటు ట్రెజరీ మార్కెట్‌లో వేగంగా జరుగుతున్న అమ్మకాల గురించి వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారులు కూడా అధ్యక్షుడికి వివరించారట.
ఇదిలాఉండగా టారిఫ్‌లపై విరామం ప్రకటించిన అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ బాండ్‌ మార్కెట్‌ గురించి ప్రస్తావించడం గమనార్హం. బాండ్‌ మార్కెట్‌ చాలా గమ్మత్తైనది. ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది. దీని భవిష్యత్తు గురించి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అర్థమైంది. కొంత మంది కోపంగానూ ఉన్నారని ట్రంప్‌ అన్నారు. 

కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్ట భయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం ఏంటంటే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. చాలా దేశాల్లో ప్రభుత్వంతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ బాండ్లను జారీ చేస్తుంటాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లకు సార్వభౌమ హామీ ఉంటుంది.