పాపం: విషాదంలో వింత..
posted on Jul 5, 2016 3:33PM
మరణం చాలా విచిత్రంగా సంభవిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. ఎంతో పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడిన వారు తమాషాగా మరణిస్తుంటారు. భారీ కాయం ఉన్న ఒక భార్య తన భర్తపై కాలు జారి పడటంతో ఇద్దరు మరణించిన ఘటన గుజరాత్లో జరిగింది. రాజ్కోట్లోని కలావడ్ రోడ్డులోగల రామ్ దామ్ సోసైటీలో మంజుల విఠలానీ, నట్వర్ లాల్ అనే భార్యభర్తలు నివసిస్తున్నారు.
మంజుల 128 కేజీల బరువు ఉంటారు. వీరి కుమారుడు ఆశిష్, కోడలు నిశా వీరి ఇంటిలోనే పై ఫ్లోర్లో ఉంటారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆశిష్కు శ్వాస సంబంధమైన ఇబ్బంది రావడంతో కోడలు నిశా మందులు తీసుకెళ్లేందుకు కిందకి వచ్చింది. అదే సమయంలో అత్తమామలైన మంజుల, నట్వర్ లాల్ కూడా కొడుక్కి ఏమైందోనన్న కంగారుతో మెట్లెక్కెందుకు ప్రయత్నించారు. అలా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మంజుల తన బరువును ఆపుకోలేక కాలుజారి వెనుక వస్తున్న భర్త నట్వర్లాల్పై పడింది. ఆమె అధిక బరువు ఉండటంతో ఆయన కిందపడిపోవడంతో ఇద్దరి తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోయారు.