బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం
posted on Jul 3, 2022 12:01PM
బీజేపీ విజయ సంకల్ప సభకు వరుణ గండం పొంచి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించతలపెట్టిన ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అంతే ఇంత భారీగా నిర్వహించతలపెట్టిన సభకు వరుణ గండం పొంచి ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన, టెన్షన్ నెలకొంది.
శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన మోడీ కటౌట్ కూలిపోవడంతో సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ వరకూ ట్రాఫిక్ ను నిలిపివేశారు. వాతావరణ శాఖ హైదరాబాద్ లో ఆదివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యలో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర కేబినెట్.. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం ఈసభకు హాజరవుతుండడంతో తెలంగాణ బీజేపీ నేతలు కూడా తమ బలాన్ని ప్రధానమంత్రి ముందు ఈ సభ ద్వారా ప్రదర్శించేందుకు ప్రయత్నం చేసిన, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సభపై ఆందోళన ఏర్పడింది. ఇక బీజేపీ విజయ సంకల్ప సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రూట్లలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. హెచ్ఐసీసీ మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ చుట్టు పక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించారు. అలాగే టివోలి క్రాస్ రోడ్ నుండి ప్లాజా క్లాస్ రోడ్ మధ్య రహదారి మూసివేశారు.
అలాగే చిలకలగూడ క్రాస్ రోడ్, అలుగడ్డబాయి క్రాస్ రోడ్, సంగీత్ క్రాస్ రోడ్, వైఎంసీఏ క్రాస్ రోడ్, ప్యాట్నీ క్రాస్ రోడ్, ఎస్బీహెచ్ క్రాస్ రోడ్, ప్లాజా, సీటీవో జంక్షన్, బ్రూక్బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకార్ఉప్కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్, తాడ్బండ్ క్రాస్ రోడ్ సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్ బోయినపల్లి క్రాస్ రోడ్, రసూల్పురా, బేగంపేట్ ప్యారడైజ్ మార్గాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకూ ప్రయాణాలు వద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.